Sakshi News home page

ఏటీఎం నుంచి రూ 2000 నకిలీ నోటు

Published Mon, Nov 6 2017 8:05 PM

Man gets fake Rs 2,000 note at Delhi ATM  - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: నోట్ల రద్దు నిర్ణయం వెలువడి ఏడాది అవుతున్నా జనానికి కరెన్సీ కష్టాలు తొలగలేదు. దేశ రాజధానిలో సోమవారం ఏకంగా ఏటీఎం నుంచే ఓ వ్యక్తికి రూ 2000 నకిలీ నోటు వచ్చింది. దక్షిణ ఢిల్లీలోని ఓ ఏటీఎంలో మహ్మద్‌ సదాబ్‌ అనే వ్యక్తి సోమవారం మధ్యాహ్నం డీసీబీ బ్యాంక్‌ ఏటీఎంలో రూ 10,000 డ్రా చేశారు. వీటిలో ఓ 2000 నోటు ఒక వైపు తెల్లకాగితం ఉండటంతో అవాక్కై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

యస్‌ బ్యాంక్‌లో ఖాతా కలిగిన సదాబ్‌ తొలుత నకిలీ నోటుపై తన బ్యాంక్‌ కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశారు. ఏటీఎంలో సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నామని, నగదు నింపిన సిబ్బందిని, సంబంధిత అధికారులను ప్రశ్నిస్తున్నామని పోలీసులు చెప్పారు.

గతంలోనూ ఢిల్లీలోని పలు ఏటీఎంల్లో నకిలీ రూ 2000 నోట్లు వచ్చాయి. చిల్డ్రన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అని రాసి ఉన్న నకిలీ నోట్లు సంగం విహార్‌, అమర్‌ కాలనీ ప్రాంతాల్లోని ఏటీఎంల నుంచి కస్టమర్లకు వచ్చాయి.

Advertisement
Advertisement